రాజీ మార్గంలో వివాదాల పరిష్కారమే లోక్ అదాలత్ ప్రధాన లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ న్యాయపరమైన సమస్యలకు త్వరితగతిన పరిష్కారం పొందాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా వివాదాలు శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా పరిష్కారమవుతాయని తెలిపారు. రాజీకి అనుకూలమైన క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆస్తి వివాదాలు, బ్యాంకు బకాయిలు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు తదితర అంశాలను ఇరుపక్షాల చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. చిన్నచిన్న వివాదాల కోసం కోర్టుల చుట్టూ తిరిగి సమయం, ధనం వృథా చేసుకోకుండా న్యాయశాఖ అందిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పరిధిలోని పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది రాజీకి అనువైన కేసులను గుర్తించి, సంబంధిత వ్యక్తులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరేలా కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. లోక్ అదాలత్లో ఇరుపక్షాల అంగీకారంతో కుదిరిన రాజీ చట్టపరంగా తుది తీర్పుగా పరిగణించబడుతుందని తెలిపారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తల సమన్వయంతో కేసుల పరిష్కార ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు, పోలీసు శాఖ, న్యాయస్థానాలు సమన్వయంతో పనిచేస్తే చిన్న వివాదాలు పెద్ద సమస్యలుగా మారకముందే పరిష్కరించవచ్చని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.

Comments 0