బీజేపీ చేపట్టిన విజయసంకల్ప యాత్రలో భాగంగా ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామానికి బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. విజయసంకల్ప యాత్ర విజయవంతంగా జరుగుతుండటంతో కాంగ్రెస్ నాయకులు వణికిపోతున్నారు. బీజేపీ తో పొత్తు పెట్టుకోవడ కోసమే ఫిబ్రవరి 22వ తేదీన మాజీ సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపణలు చేశారు. బీజేపీ ఇమేజ్ ను తగ్గించాలనే ఉద్దేశంతో మ్యానుఫ్యాక్చరింగ్ వార్తలు సృష్టించారు. మాజీ ముఖ్యమంత్రికి ఫ్లైట్ బుకింగ్ నుంచి మొదలు ప్రధాని అపాయింట్ మెంట్ వరకు.. వార్తలు సృష్టించారు. మ్యానుఫ్యాక్చరింగ్ వార్తలతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారం చెలాయించాలనుకుంటోంది. తప్పుడు వార్తలతో తెలంగాణలో అధికారం చెలాయించాలనుకుంటున్న కాంగ్రెస్ కు ఎలా బుద్ధిచెప్పాలో ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్-బీజేపీ ఒకటేనంటూ కాంగ్రెస్-బీఆర్ఎస్ తోలుబొమ్మల నాటకం ఆడుతున్నాయి. ఎల్ ఎల్ బీసీ టన్నెల్ పూర్తికాకపోవడానికి నాడు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిర్లక్ష్యమే. నల్లగొండకు నీళ్లు తీసుకురాలేకపోయిన అసమర్థుడు. కాంగ్రెస్ హయాంలో నల్లగొండ జిల్లాకు ఒక్క ఫ్యాక్టరీ నిర్మించలేని, ఎల్ ఎల్ బీసీ టన్నెల్ పూర్తిచేయించలేని అసమర్థ నాయకుడు కోమటిరెడ్డి. గతంలో కోమటిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో సూర్యాపేట, కోదాడ దగ్గర నాగార్జునసాగర్ ప్రాజెక్టులోని లిఫ్టులను బంద్ చేయించారు. మునుగోడు నియోజకవర్గంలో మంచినీళ్లు అందించిన ఘనత వాజ్ పేయి గారి హయాంలోని కేంద్ర ప్రభుత్వానిది. వాజ్ పేయి గారి హయాంలో రూ. 748 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యలకు పరిష్కారం చూపారు. కాంగ్రెస్ హయాంలో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాల్లో కనీసం ఒక్క టీఎంసీ ప్రాజెక్టు అయినా నిర్మించగలిగారా..? కోమటిరెడ్డి గారు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా బీజేపీ -బీఆర్ఎస్ ఒకటేనంటూ చేసే పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిపై, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బడి సంజయ్ కుమార్ గారిపై విచక్షణ మరిచి మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం. పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేదంటూ వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డికి... జాతీయ హోదా రావాలంటే నియమనిబంధనలు తెలుసా..? తెలంగాణలో అత్యంత వెనుకబడ్డ నియోజకవర్గం కొడంగల్. సొంత నియోజకవర్గ సమస్యలే పట్టించుకోలేని వ్యక్తి.. పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదా అంటూ మాట్లాడటం సిగ్గుచేటు. 100 రోజుల్లోగా 6 గ్యారంటీలు.. 13 వాగ్ధానాలు నెరవేరుస్తామన్నారు. మరి ఇప్పటివరకు... ఎందుకు నెరవేర్చలేదు..? మహిళలకు రూ.2500, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.500కే సిలిండర్‌, రైతుబంధు, రుణమాఫీ, రూ.4వేల పింఛన్‌లాంటి హామీలు ఎందుకు అమలు చేయలేదు..? బీజేపీ విజయసంకల్ప యాత్ర విజయవంతం అవుతుండటంతో జగ్గారెడ్డి గారు ఇష్టానురీతిగా మాట్లాడుతున్నారు. ప్రశ్నించే హక్కు బీజేపీ కి ఉంది.. సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. అది తెల్సుకొని మసలుకోవాలి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ గారు మాట్లాడిన ముఖ్యాంశాలు : **** పదేపదే కాంగ్రెస్ నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిపై చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఇచ్చిన బూటకపు హామీలను నెరవేర్చలేకనే, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు బీజేపీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి లోపాయికారీ ఒప్పందం ఉంది. అందుకే గత ప్రభుత్వ అవినీతిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మాజీ ప్రధాని అయిన స్వర్గీయ పీవీ నరసింహారావు గారికి కేంద్రంలోని మోదీ సర్కార్ భారత రత్న ఇచ్చి, గౌరవిస్తే... కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీన్ని బట్టి చూస్తే.. ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అనేది కుటుంబ పార్టీనేనని అర్దమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి తెలిసిందల్లా టికెట్లు అమ్ముకోవడమే. తప్పుడు హామీలతో ప్రజలను నమ్మించి, గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ... ఇచ్చిన హామీలను ఎప్పటిలోగా నెరవేరుస్తారో చెప్పే దమ్ముందా..? విజయ సంకల్ప యాత్ర పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకంటే ప్రచారంలో బీజేపీ ముందు ఉండి, దూసుకుపోతుండడంతో, చేసేదేమి లేకనే... కాంగ్రెస్ నేతలు బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. కోమటిరెడ్డి గారి లాంటి నాయకులు.. మంత్రి పదవిలో ఉండి బీజేపీ నాయకులపై ఏకవచనంతో విమర్శలు చేయడం తగదని హెచ్చరిస్తున్నాం. బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలవి ఫెవికాల్ బంధం.. టికెట్ల విషయంలో కలిసి పంపకాలు చేసుకుంటారు. కాంగ్రెస్ కూలిపోతుండటంతో, భయంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజస్థాన్ నుండి రాజ్యసభకు వెళ్లారు. రాయ్ బరేలిలో రాహుల్ గాంధీ యాత్రకు ఎదురుదెబ్బ తగలడంతో పాటు.. ప్రజలు నల్ల జెండాలతో గో బ్యాక్ అంటూ తరిమికొట్టారు. పదేండ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.9.50 లక్షల కోట్లు నిధులు కేటాయించింది. గత కేసీఆర్ సర్కార్ భూములిచ్చేందుకు సహకరించకున్నా... ట్రైబల్ యూనివర్సిటీ, ఆర్ఆర్ఆర్ సహా ఎన్నో వాటికి అనుమతులతో పాటు, నిధులను మంజూరు చేసింది. గత ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అప్పులకుప్పగా మారిందంటున్న కాంగ్రెస్ పార్టీ.. ఇచ్చిన గ్యారంటీలు, హామీలు ఎలా అమలు చేస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు మాట్లాడిన ముఖ్యాంశాలు : **** కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 75 రోజులు గడిచిపోయింది. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబం ఏటీఎంగా మార్చుకుని వేలకోట్లు నిధులు కాజేసిందని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల వేల ప్రచారం చేశారు. మరి అధికారంలోకి వచ్చాక అవినీతి నాయకులపై ఎందుకు కేసులు నమోదు చేయడంలేదు..? లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా విపక్ష పార్టీలకు అయ్యే ఎన్నికల ఖర్చును మొత్తం తానే భరించేందుకు సిద్ధమని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ గతంలో చెప్పారు. అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి..? కాళేశ్వరం ప్రాజెక్టులో సంపాదించిన అవినీతి సొమ్మును స్పాన్సర్ చేసేందుకేనా..? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్ణాటక నుంచి డబ్బులు జారగొట్టారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఖాళీ అయిపోతోంది. ఇండి కూటమి చెల్లాచెదురవుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్టీ అధ్యక్షులతో పాటు పాతతరం, కొత్తతరం నాయకులంతా ఇప్పటికే పార్టీ నుంచి వెళ్లిపోయారు. టచ్ చేస్తే బీజేపీని నామరూపాల్లేకుండా చేస్తామని కోమటిరెడ్డి అంటున్నరు.. అసలు మీ పార్టీనే ఖాళీ అవుతోంది. కాంగ్రెస్ ను టచ్ చేయాల్సిన అవసరమేముంది..? కాంగ్రెస్-బీఆర్ఎస్ రహస్య మిత్రులు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేసులను నిర్వీర్యం చేయాలని చూస్తోంది.