హత్య కేసును నీరు కారుస్తున్నారు... కేసు నుండి నిందితులను తప్పించే ప్రయత్నం... డబ్ల్యూజేఐ నేతలతో కేంద్ర మంత్రిని కలిసిన ఇల్లందు బాధిత విలేకరి సుదర్శన్ కరీంనగర్, నవంబర్ 5:- తనను హత్య చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తులను అరెస్టు చేసే విషయంలో పోలీసులు విచారణ పేరిట కాలయాపన చేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల విలేఖరి నిట్ట సుదర్శన్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తెచ్చారు. ఈ కేసులో తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేకుండా పోయిందన్నారు. తనపై జరిగిన హత్యోదంతంలో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టే విధంగా సంబంధిత ఉన్నతాధికారులకు సూచన చేయాలని సుదర్శన్ కేంద్ర మంత్రిని అభ్యర్థించారు. మంగళవారం బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా నాయకులు న్యాలకొండ అనిల్ రావ్, తాడూరు కరుణాకర్, శివనాద్రి ప్రమోద్ కుమార్, టి సత్యనారాయణ, దారం జగన్నాథరెడ్డి, ఆడెపు లక్ష్మీనారాయణ, మొగురం రమేష్ తదితరులతో ఆయన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలిశారు. అక్టోబర్ 17న తనపై జరిగిన దాడికి సంబంధించి సూత్రాదారుల్లో స్థానిక ఎమ్మెల్యే అనుచరులు , రౌడీ షీటర్లు, డీఎస్పీ సమీప బంధువు ఉండడంతో కేసును నీరుగార్చేందుకు శత విధాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని సుదర్శన్ కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. స్థానిక డీఎస్పీ మొదటి నుండి కేసును నీరుగార్చేందుకు, నిందితులను కేసు నుండి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని సుదర్శన్ ఆరోపించారు. ఎమ్మెల్యేసమీప బంధువు నాగేశ్వరరావు, అనుచరుడు ఆముదాల ప్రసాద్ ఈ కేసులో ఏ-8 గా ఉన్న విషయాన్ని బాధితుడు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. తనపై దాడికి సంబంధి స్పష్టమైన ఆధారాలు వీడియో ఫుటేజ్ రూపంలో ఉన్నప్పటికీ,అందులో కొందరిని కేసులో పేర్కొనకుండా డీఎస్పీ కిందిస్థాయి పోలీసులపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని సుదర్శన్ ఆరోపించారు. తనపై దాడికి పాల్పడిన వారిపై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణ బాధ్యత డిఎస్పీపై ఉన్నప్పటికీ, ఆయన ఆ బాధ్యతను విస్మరించారని అన్నారు. సమాజంలో జరిగే తప్పులను ఎత్తిచూపే జర్నలిస్టులపై ఏకంగా దాడులు, హత్యా యత్నాలు జరుగుతున్నా ... అందుకు సంబంధించిన వీడియోలు కళ్ల ముందు కనబడుతున్నా ... అధికార ఎమ్మెల్యే అండదండలు, పోలీసు ఉన్నతాధికారుల ఆశీస్సులతో తనపై జరిగిన హత్య కేసు నీరు కార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని సుదర్శన్ కేంద్రమంత్రికి తెలిపారు. కేసులో పేర్కొన్న నిందితుల ఫోన్ డేటా పరిశీలిస్తే ... వారికి అండగా ఉన్న రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారుల పాత్ర బయట పడుతుందని,కనుక ఆ దిశగా విచారణ జరిగేలా చూడాలని సుదర్శన్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో నిష్పాక్షిక విచారణ జరిగేలా చూసేందుకు, సంబంధిత అధికారులతో మాట్లాడతానని కేంద్ర మంత్రి బండి సంజయ్ సుదర్శన్ తో పాటు, డబ్ల్యూజేఐ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు.
Comments 0