శుక్రవారం నుండి ప్రారంభం కానున్న ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను విజయవంతం చేయాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు. ఈ మేరకు నగర పాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా పరిసరాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ లక్ష్యంగా ఈ నెల 6 నుండి 15 వరకు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవం శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ హాజరవుతారని, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొంటారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రోడ్లు, కాలువలు శుభ్రం చేయడం, వాహనాల మరమ్మత్తులు చేయించడం, నీటి సరఫరా సమస్యలను పరిష్కరించడం, అన్ని వీధి దీపాలు వెలిగేలా చూడడం వంటి పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. డివిజన్‌లలో ఈ కార్యక్రమాలు విజయవంతం కావడానికి కార్పొరేటర్లు సహకరించాలని మేయర్ కోరారు.ఈ సమావేశంలో నగర పాలక సంస్థ ఎస్.ఈ గురువీర, ఈ.ఈ పి.వి. రామన్, డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డి.ఇ షాబాజ్, టిపిఎస్ నవీన్, ఆర్.ఓ ఆంజనేయులు, ఏ.ఈ తేజస్విని, మెప్మా టీఎంసీ మౌనిక తదితరులు పాల్గొన్నారు.