ఈ వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్ బుధవారం గోదావరి నది వద్ద ఉన్న ఇన్‌టేక్ వెల్‌ను పరిశీలించారు. నిల్వ నీటి స్థాయి, పంపుల పనితీరు, వర్షాలకు దెబ్బతిన్న కట్టల పునరుద్ధరణ పనులపై సమీక్ష నిర్వహించారు. ఆర్జీ-1, 2, 3 ప్రాంతాలు, అడ్రియాల, సెంటినరీ కాలనీ, 8 ఇన్‌క్లైన్ కాలనీ, విట్టల్ నగర్, గంగనగర్ తదితర ప్రాంతాలకు నీటి సరఫరా ఏర్పాట్లపై సమగ్ర చర్చ జరిగింది. ఈ ఏడాది కూడా నీటి కొరత లేకుండా సరఫరా చేస్తామని జీఎం తెలిపారు. మేడిపల్లి ఓసీ నుంచి గంగనగర్ ఫిల్టర్ బెడ్ వరకు నీటిని తరలించి అక్కడి నుంచి పంపింగ్ చేయనున్నట్లు, ఓసీ-5లో కొత్త బోర్లు ఏర్పాటు చేసి 5 ఇన్‌క్లైన్ ఫిల్టర్ బెడ్‌కు అనుసంధానం చేస్తున్నట్లు వెల్లడించారు. భూగర్భ గనులు, ఓపెన్‌కాస్ట్ గనులు మరియు గోదావరి నీటిని సమన్వయంతో వినియోగించి సింగరేణి ప్రాంతాలకు మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు సరఫరా చేస్తామని తెలిపారు.వేసవి దృష్ట్యా ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని జీఎం విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.