శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో ఓ అద్భుతం జరిగింది. మూడు దశాబ్దాలకు పైగా మూసేసిన శ్రీరాముడి ఆలయం తిరిగి తెరుచుకుంది. ఈ ఆలయం హబ్బాకడల్ ప్రాంతంలో వుంది. దీంతో కశ్మీర్ లోయ చరిత్రలో ఈ ఆలయం తిరిగి తెరుచుకోవడం ఓ మైలు రాయిగా నిలిచిపోతుంది. 1857 లో ఈ ఆలయం నిర్మితమైంది. ఈ ప్రాంతంలోనే అత్యంత పురాతనమైంది. 1990 ప్రాంతంలో ఇస్లామిక్ ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా, కశ్మీరీ హిందువుల సామూహిక వలసల కారణంగా అనేక ఆలయాలు మూతపడ్డాయి. అందులో ఈ ఆలయం కూడా వుంది. ఆలయం పున: ప్రారంభం అవడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సంప్రదాయంగా చేసే కార్యక్రమాలన్నీ చేశారు., ఒక భారీ మహా యజ్ఞం కూడా చేశారు. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఈ ఆలయం తిరిగి తెరవడంతో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. 36 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రారంభం కావడంతో భక్తులు ఆనందపరవశులయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాశ్మీరీ హిందూ సమాజ సభ్యులు భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రయాణించి వచ్చారు. ఈ ఆలయం తిరిగి తెరుచుకోవడం ద్వారా కశ్మీర్ సాంస్కృతిక వారసత్వం తిరిగి ప్రారంభమైందని స్థానికులు పేర్కొంటున్నారు. వచ్చే నెలలో విగ్రహాలను కూడా ప్రతిష్ఠాపన చేయనున్నారు. కేంద్రంలోని జాతీయవాద ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసేసింది. దీంతో జమ్మూ కశ్మీర్ లో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. పర్యాటకం, సినిమా రంగం బాగా వృద్ది చెందుతోంది .