వరిధాన్యం కొనుగోలు జాప్యం తో పాటుగా,తూకం వేసిన ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించకపోవడంపై కడుపు మండిన రైతులు శుక్రవారం ఉదయం రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ,ప్రతి సంవత్సరం సొసైటీ కొనుగోలు కేంద్రం నిర్లక్ష్యంతో రోడ్డుపైకి రావాల్సి వస్తుందని,కేవలం ఆరుగురు హమాలి కూలీలతో ధాన్యాన్ని తూకం వేస్తున్నారని, తూకం వేసిన ధాన్యాన్ని లారీల కొరత ఉందంటూ మిల్లుకు తరలించకపోవడంతో నెలల పాటు శ్రమించి పండించిన పంట అకాల వర్షంతో తడిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే వర్షాలు కురిసి ధాన్యం తడిస్తే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల జాప్యంతో ప్రైవేట్ వ్యక్తులకు ధాన్యం విక్రయించాల్సి వస్తుందని,రైతులు వాపోయారు. కొనుగోళ్లు చేపట్టాలని సొసైటీ అధికారులకు అనేకసార్లు మొరపెట్టుకున్న స్పందన లేకపోవడంతో ప్రతి సంవత్సరం రోడ్డు ఎక్కాల్సి వస్తుందని,ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వేగంగా కొనుగోలు జరిపి,ధాన్యాన్ని వెంటనే మిల్లుకు తరలించే ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. రైతుల ఆందోళన సమాచారంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ దాసరి పద్మయ్య, ఏఎస్ఐ దేవేందర్ పది రోజుల్లో కల్లాల వద్ద నుండి ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని సిఈఓకు సూచించి,రైతులకు నచ్చజెప్పడంతో నిరసన విరమించారు.రైతుల ధర్నాతో రోడ్డుకిరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.