రాయికల్ పట్టణం జ్వరాలతో మంచం పట్టింది. ఒక్క ఇంట్లోనే ఇద్దరు, ముగ్గురు కుటుంబ సభ్యులు విషజ్వారాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఏ జ్వరమొచ్చినా ముందుగా డెంగీపైనే ప్రజల్లో పలుఅనుమానాలు పెరుగుతున్నాయి. రోగుల తాకిడితో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో, డయాగ్నోస్టిక్స్ సెంటర్ లో డెంగీ వ్యాధి నిర్ధరణకు రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. ఒకసారి నిర్ధరణ అయితే జ్వరం తగ్గే వరకు అంటే మూడు నుంచి నాలుగు రోజులపాటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తుండటం వల్ల ఖర్చు తడిసి మోపెడవుతుంది. ప్లేట్‌లేట్స్‌ తగ్గితే అదనంగా పదివేల పైచిలుకు వ్యయం అవుతుంది. అప్పో, సొప్పో చేసైనా రోగాన్ని తగ్గించుకోవాలని పట్టణ ప్రజలు ప్రయత్నిస్తున్నారు . ఆసుపత్రికి వస్తున్న వారిలో ఎక్కువ మందికి వైరల్‌ జ్వరాలు మాత్రమే వస్తున్నాయని... డెంగీ అని భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కనీస వసతులైన త్రాగునీరు, ఫ్యానులు కూడా లేక ఉక్కపోతుతో చికిత్స పొందుతున్నారు, డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు చేయాలని జ్వరాలపై నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ప్రైవేట్​ ఆస్పత్రుల్లో డబ్బులు దోపిడీ అడ్డుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.