శాసనసభలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల అనంతరం రాష్ట్రంలో జర్నలిస్టుల లెక్కలు తీయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్, కార్యదర్శి శివనాద్రి ప్రమోద్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన పలువురు జర్నలిస్టులు టీయుడబ్ల్యూజే నుండి వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణలో చేరుతున్న సందర్భంగా ఆదివారం ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డబ్ల్యూజేఐ ఆధ్వర్యంలోని ప్రెస్ క్లబ్ కమిటీని ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ జర్నలిస్టులను గుర్తించడానికి ప్రాతిపదిక, ప్రమాణాలను కూడా ముఖ్యమంత్రి నిర్దేశిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో జర్నలిస్టుల స్థితిగతుల పరిశీలనకు ఉద్దేశించిన మీడియా అకాడమీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నప్పటికీ, దాని కర్తవ్య నిర్వహణలో వైఫల్యాలే ముఖ్యమంత్రి అసహనానికి కారణమై ఉంటుందని జర్నలిస్ట్ సమాజం భావిస్తోందన్నారు. రాష్ట్రంలో అసలు, సిసలు జర్నలిస్టుల లెక్కలు తీర్చే కార్యాన్ని ప్రభుత్వం, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మీడియా అకాడమీలలో ఎవరు నిర్వర్తిస్తారో అదే వేదికగా ముఖ్యమంత్రి ప్రకటిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా, వర్కింగ్ జర్నలిస్టుల చట్టంలో సవరణలకే దిక్కు లేనప్పుడు అవసరమైతే ఇక్కడ చట్టాలు తీసుకు వస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం బాగానే ఉన్నా, ఆచరణ సాధ్యమేనా అని ప్రశ్నించారు. జర్నలిస్టులను గుర్తించడానికి ఉన్న ప్రమాణాలు ఏమిటి? అందుకు అక్రిడిటేషన్ కార్డులే ప్రాతిపదికగా నిలుస్తాయా, సంస్థలు ఇచ్చే ఐడెంటి కార్డులు ప్రామాణికంగా నిలుస్తాయా అన్న విషయంపై కూడా స్పష్టత ఇస్తే బావుంటుందన్నారు. అన్ని వృత్తులు, సంఘాలలో అందరూ నిజాయితీపరులే ఉండాలని భావించడంలో అర్థం లేదని, అందుకు జర్నలిజం వృత్తి కూడా మినహాయింపు కాదన్నారు. అంతమాత్రాన మొత్తం జర్నలిస్టు సమాజాన్ని బజారున నిలబెడదామని అనుకోవడంలో అర్థం లేదన్నారు. అక్రిడిటేషన్ల నిబంధనలు తయారు చేయడానికి ప్రభుత్వం నియమించిన కమిటీ అధ్యక్షుని నిష్క్రియ ప్రియత్నంవల్ల ఈరోజుకు అందుకు సంబంధించి అడుగు ముందుకు పడలేదని, దీంతో ప్రతి మూడు నెలలకు ఒకసారి అక్రిడిటేషన్లను రెన్యువల్ చేయించాల్సిన దుస్థితి దాపురించిందని అన్నారు. మీడియా అకాడమీ పాలకవర్గానికి ప్రభుత్వం ఆమోదం ముద్ర వేసి ఏడాది పూర్తవుతున్నా, గ్రామీణ జర్నలిస్టుల శిక్షణ తరగతులు నిర్వహించలేని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు. ఈ వైఫల్యాల నుండి జర్నలిస్టు సమాజాన్ని దారి మరల్చేందుకు రాష్ట్రాలు తమకు మించిన సంఘం లేదని గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. తమది మొనగాడు సంఘమని ఒక నాయకుడు ఛాతి విరుచుకుంటున్నాడని, జర్నలిస్టులను మోసం చేయడంలో, వారిని అడ్డం పెట్టుకొని తాములబ్ది పొందడంలో వాళ్లది మొనగాడు సంఘమేనని తెలిపారు. డబ్ల్యూజెఐ సిరిసిల్ల బాధ్యుడు గంగు సతీష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముస్తాబాద్ మండల ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ఎన్నిక చేశారు. అధ్యక్షునిగా అబ్రమేని దేవేందర్, అధ్యక్షులుగా మేకర్తి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కారెడ్ల రాజ్ కిరణ్ రెడ్డి, కోశాధికారిగా ఏర్పుల రాజు ఎన్నికయ్యారు. డబ్ల్యూజేఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరు కరుణాకర్, రాష్ట్ర కార్యదర్శి శివనాద్రి ప్రమోద్ వారిని శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
Comments 0