గద్దర్ ఫౌండేషన్ హైదరాబాదులో గద్దర్ జయంతి సభను నిర్వహించింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఏడాది 2025 సంవత్సరంలో గద్దర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని ప్రకటించారు. తన మాటే శాసనం అని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో గద్దర్ గూర్చి కొంత నిష్పక్షపాత వైఖరితో కూడిన కొన్ని మాటలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని విషయాలు అభిప్రాయాలు కొందరికి నచ్చకపోవచ్చు అంతమాత్రాన సత్యం నిజం తెరమరగు కారాదు కదా!, వాస్తవానికి గద్దర్ తన జీవితంలో సింహాభాగం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసించలేదు. పైగా పార్లమెంట్ ఒక పందుల దొడ్డి అసెంబ్లీ ఒక బాతకాని క్లబ్ అంటూ అగౌరవపరుస్తూ దూషిస్తూ వేలాది వేదికలపై మాట్లాడాడు. పాటలు పాడాడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం మావోయిస్టుల ఆధ్వర్యంలో కదం తొక్కాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చాడు. ఆ విప్లవం తుపాకీ గొట్టం ద్వారానే సాధ్యమని అందుకే సాయుధంగా తిరగబడమని దశాబ్దాల పాటు ఆయన సాంస్కృతిక ఉద్యమం చేశాడు. తెలుగు నేలపైనే కాక దేశం లోని ఇతర ప్రాంతాల్లోనూ మావోయిస్టులతో కలిసి ప్రచారం చేసిన విషయం అందరికీ తెలుసు. దేశమంతా కలియతిరిగి ప్రజాస్వామ్య ప్రక్రియపై నిప్పులు చెరిగాడు. పాటను ఒక అస్త్రంగా మలుచుకొని ఆటపాటలతో అనేక మందిని ఆకర్షించాడు. అంతేగాక మావోయిస్టులతో కలిసి కొంతకాలం అజ్ఞాత జీవితం గెరిల్లా జీవితం గడిపాడు. వేలాదిమంది యువతి యువకులను అజ్ఞాత గెరిల్లా జీవితం గడిపేందుకుగాను అడవుల్లోకి ఆహ్వానించాడు. ఆయనపై గల గురి నమ్మకంతో అనేకమంది అడవులకు వెళ్లారు. ఇదంతా జగమెరిగిన సత్యం. ఎన్నికైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు సహచర మావోయిస్టులతో కలిసి ఆయన కుట్ర చేశాడు. ఆయనపై నమోదైన అనేక కేసులు అందుకు సాక్ష్యం. అలాంటి గద్దర్ మావోయిస్టుల ప్రతినిధిగా గత కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చలు జరిపి మావోలకు ఎంతో మేలు చేకూర్చి వారి బలోపేతానికి అవిశ్రాంతంగా శ్రమించిన వ్యక్తి. కళాకారుడు అయినంత మాత్రాన ఇప్పుడు ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వానికి ఎలా ఆదర్శప్రాయుడవుతాడు. ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిపేందుకు ఎలా నిశ్చయిస్తుంది. ఇది కోటి రూకల ప్రశ్న. ఆరోగ్యకర ఆలోచనలు చేసే వారికి ఇది ఆశ్చర్యం కలిగించే అంశం. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వంలో పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీ పూర్వ నామం జరిపి చర్చలు విఫలమయ్యాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా అలజడి సృష్టించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దరు తీవ్రంగా దూషించిన విషయం విస్మరించరానిది. అంతటి ఘన చరిత్ర గల గద్దరును వర్తమాన కాంగ్రెస్ ప్రభుత్వం నాయకత్వం ఆదర్శంగా భావించడం ఆశ్చర్యకరంగా ఆందోళనకరంగాను ఉంది. కవి గాయకునిగా గద్దర్ బాబు కథ కళా నైపుణ్యం రసజ్ఞత విశిష్టత గొప్పదే దాన్ని అభిమానించాలి అంతేగాని అవి ఉన్నాయని ఉన్నత పీఠం ఎక్కించి ఆదర్శప్రాయుడని పిలవడం సమంజసం అవదు. ఆదర్శం వేరు అభిమానం వేరు ఆ స్పష్టత ఉండాలి. ఎవరైనా తరతరాలు గుర్తించుకోదగ్గ రీతిలో నిస్వార్ధంగా ప్రజలకు సేవలు అందించినప్పుడే బోధించేవి ఆచరించినప్పుడే ఆదర్శప్రాయులని పించుకుంటారు. ఈ కుల బద్ద కొలమానంతో చూస్తే గద్దర్ ఎక్కడ నిలవడు. ఆ విధంగా ఆయనను తిలకించలేము. ఆయనను కేవలం అభిమానించగలం. అంతేగాని ఆదర్శవంతంగా గొప్ప త్యాగధనుడిగా త్యాగ పురుషునిగా పరిగణించలేము. ఆయన జీవనయానాన్ని నిశితంగా పరిశీలిస్తే ఈ విషయాలన్నీ స్పష్టంగా తెలుస్తాయి. కలను విప్లవీకరించి విప్లవాన్ని రాజకీయాలతో మిళితం చేసి మావోయిస్టుల అప్పటి పీపుల్స్ వార్ తో ప్రయాణం కొనసాగించినప్పటికీ అక్కడ కూడా అనేక ఆరోపణల కారణంగా రెండుసార్లు గద్దర్ బహిష్కరణకు గురైన సంగతి కూడా విస్మరించరాదు. అతనిలోని దురాశ అతనిలోని అత్యాశ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనిపించడం లేదు గాక లేదు. మరి అలాంటి వ్యక్తిత్వం అధికారలాలస పెత్తనం తొలగించాలనే తత్వం ఏరకంగా నైనా సరే చక్రం తిప్పాలన్న తాపత్రయం ఎంతవరకు ఆమోదయోగ్యమవుతుంది. ఇట్లా ఎక్కడ నిలకడ లేని తనంతో పాటు నిజాయితీని సైతం సమాధి చేసిన ఘన చరిత్ర ఆయనది. ఆయన జీవన మలుపును నిండా ఇవే అసంబద్ధ వ్యవహారాలు దర్శనమవుతాయి. చివరికి తాను రాజకీయ నాయకుడిగా ప్రకాశించలేకపోయినా తన పుత్రరత్నాన్ని తన తదనంతరం సూర్యాన్ని రాజకీయ నాయకుడిగా చేసేందుకు ఆయన పడిన తాపత్రయం హైరానా అంతా ఇంతా కాదు. దీన్ని పరిశీలించిన వారందరూ ఆనాడు ముక్కున వేలేసుకున్నవారే, అలాగే గద్దర్ చేసిన ప్రబోధాలకు ఆచరణకు వాటి పట్ల ఆయనకున్న నిబద్ధతను కూర్చి కొన్ని విషయాలు ముచ్చటించుకోవాలి. సమాజంలోని సమస్యలన్నింటికీ మూల కారణం సొంత ఆస్తి ఉన్న కార్ల్ మార్క్స్ మాటను కమ్యూనిస్టు మావోయిస్టుల వాక్కును ఆయన గట్టిగా బలపరుస్తూ దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా పాటలు పద్యాలు పాడిన సంగతి తెలిసిందే, కమ్యూనిస్టుల మూల సిద్ధాంతం వైపు ప్రజల్ని ఆకర్షించి ఉద్యమం వైపు కదిలేలా ఆహరహం పనిచేశాడు. సొంత ఆస్తి రద్దు సిద్ధాంతాన్ని ప్రచారం చేసి చివరికి ఆయన పెద్ద ఎత్తున స్థిర స్థిరాస్తులను పోగేశాడు. కార్పొరేట్ స్థాయిలో మహాబోధి విద్యాలయ పాఠశాలను నెలకొల్పాడు. మరి ఇదేలా నిబద్ధతతో కూడిన నిబద్ధత అనిపించుకుంటుంది. ఇది అందరూ నిశితంగా ఆలోచించాల్సిన విషయమే కదా, చెప్పే మాటకు చేతకు పొంతన ఉన్నప్పుడే కదా ఎవరి వ్యక్తిత్వమైన వెలుగొందుతుంది. అప్పుడే కదా అందరూ అలాంటి వ్యక్తిని ఆదర్శంగా భావిస్తారు. గద్దర్ సమకాలికుడు అదే సమకాలీన వర్గానికి చెందిన ప్రముఖ కవి గూడ అంజయ్య రాసిన ఊరు మనదిరా ఈ వాడ మనదిరా...! అన్న పాట గద్దర్ కు అపారమైన కీర్తి ప్రతిష్టలను గౌరవాన్ని తెచ్చి పెట్టింది. ఈ పాట రాసిన గూడ అంజయ్యకు మాత్రం ఎక్కడా గౌరవం దక్కలేదు. గద్దర్ సమకాలీకులైన కవుల కళాకారుల ఆస్తులు ఏ మాత్రం పెరగలేదు. గద్దర్ ఆస్తులు మాత్రం బాగా పెరిగాయి. ఇది ఎలా జరిగింది అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది గదా ఇక్కడే తిరకాసు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూత లూగించిన మరొకవి అందెశ్రీ. ఆయన రాసిన జయ జయహే తెలంగాణ అన్న గీతం ఇప్పుడు రాష్ట్ర అధికార గీతంగా గౌరవం పొందింది. అదిగో అలాంటి కవి గాయకుడికి సొంత ఆస్తి ఏ మేరకు ఎగబాకింది. గద్దర్ సొంత ఆస్తి తారాజువ్వల ఎలా దూసుకుపోయింది, అటు విప్లవ గేయాలతో గూడ అంజయ్య ఇటు తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాత్ర అపూర్వమైనది కాదని ఎవరైనా అనగలరా. వారు నిస్వార్ధంగా నిజాయితీగా నిండు హృదయాలతో నిబద్ధతతో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉద్యమ సాహిత్యాన్ని సృష్టించి తెలంగాణ నేలను పావనం చేశారు. నిష్కామ కర్మగా కృషి చేశారు. వారి సాధారణ సామాన్య జీవితం ఆదర్శ అవుతుందా లేక ఆర్భాటం చేస్తూ ఆటపాటలతో ఆకర్షించి మాయ చేసి చెప్పేదానికి చేసేదానికి పొంతన లేని రీతిలో జీవితం గడిపిన గద్దర్ ఆదర్శప్రాయుడు అవుతాడా ? ఎవరికి వారే ఆలోచించుకొని సమాధానం చెప్పుకోవాలి. మతం మత్తుమందు అన్న మార్క్స్ మావోల మాటను భారత దేశంలో బలంగా ప్రచారం చేసి సాంస్కృతిక కార్యక్రమాలు ఇచ్చి హిందూ దేవుళ్లను దూషించి సత్య సాయిబాబా లాంటి వారిని పరుషంగా విమర్శించిన గద్దర్ తన పార్టీ తనను బహిష్కరించాక తత్వం బోధపడి రకరకాల గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగాడు. పూజలు చేసి మొక్కులు మొక్కుకున్నాడు. అలువుగా పాటలు పాడి స్తోత్రాలు చేశాడు. ఈ విషయం అందరికీ తెలుసు మరి ఇది భక్తి కాదా ! ఆయనకు అందరూ సలాం చేయవలసిందే కానీ అది అభిమానం వరకు మాత్రమే పరిమితమైతే మెరుగ్గా ఉంటుంది. ఆ పరిధి దాటితే ఎ వెగటు కలిగిస్తుంది. నిజానికి పాలకులు భావోద్రేకాలకు భావోద్వేగాలకు అతీతంగా వాటికి గురి కాకుండా రాజాధర్మంపై దృష్టి సారించి ప్రజా సంక్షేమానికి వారి అభివృద్ధికి పాటు పడాలి. ఇది అనాదిగా వస్తున్న రివాజు ఆ పరిధి దాటితే సహజంగానే విమర్శలు రాజ్యంపై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. హేతుబద్ధమైన ఈ తర్కాన్ని పరిశీలిస్తే గద్దర్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తామనడంలో పాలకుల తొందరపాటు నిర్ణయం స్పష్టాతి స్పష్టంగా వెళ్లడవుతుంది. మరో మాట గద్దర్ రాజకీయ గురువు ప్రముఖ నక్సలైటు నాయకుడు కొండపల్లి సీతారామయ్య (కొండపల్లి సీతారామిరెడ్డి కె ఎస్ ) అన్న విషయం ప్రపంచమంతటికి తెలుసు గద్దర్ ఆట పాటలోని వాడి వేడి అంతా కేఎస్ దే, ఈ సంగతి సైతం జగద్వితమే, కొండపల్లి లేనిదే గద్దర్ లేడన్నది కూడా సత్యమే, కొండపల్లి సీతారామయ్య కృష్ణాజిల్లాకు చెందిన వాడు అయినప్పటికీ 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సద్దుమణి గాక 1971-1972లో తిరిగి ముల్కీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది ఆయనే. గద్దర్ ప్రజా సాంస్కృతిక రాజకీయ జీవితం అక్కడే అప్పుడే ఆరంభమైంది. కె ఎస్ కనుసన్నల లోనే ఆయన రాజకీయ పాఠాలు వల్లే వేశాడు. అయన పాటకు రాజకీయ పరిమళం అద్దాడు. తెలంగాణ ఉద్యమంతో పాటు నక్సలైటు ఉద్యమాన్ని కొండపల్లి సీతారామయ్య జమిలిగా నడిపాడు. ఆ రెండింటిలోనూ గద్దర్ పాత్ర గణనీయమైనది. నక్సలైటు ఉద్యమం ఉదృతం కావడంతో తెలంగాణ గ్రామాలు పల్లెల్లోని దొరలను పట్టణాలకు తరిమి వారి భూములను ప్రజలు స్వాధీనం చేసుకుని కార్యక్రమానికి కొండపల్లి సీతారామయ్య ముఖ్య కారకుడు. ఆ రకంగా తెలంగాణలో సామాజిక రాజకీయ చైతన్యానికి కేఎస్ కేంద్రబిందువు. తెలంగాణ ప్రజల సాధికారతకు పాటుపడిన నాయకుడు ఆయన మరణానంతరం కూడా ఆయన ప్రభావం తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కొండపల్లి సీతారామయ్య జయంతి వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్న అభ్యర్థన డిమాండ్ అందితే ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా మరి ఎలాంటి విజ్ఞాపనలు అభ్యర్థనలు డిమాండ్ లేకుండానే గద్దర్ జయంతిని వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ప్రకటించినప్పుడు గద్దర్ కన్నా గద్దర్ రాజకీయ గురువు కొండపల్లి అందుకు అర్హుడని అన్ని వివరాలు అందిస్తే డాక్యుమెంట్లు చూపితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతిస్తుందా. జయంతి వర్ధంతులను నిర్వహిస్తుందా ? కోసమేరుపు ఏమిటంటే అరబిక్ భాష నుంచి ఉర్దూలోకి వచ్చిన గద్దర్ అన్న పదానికి నిఘంటువులో అర్థం వెతికితే ఆశ్చర్యం కలుగుతుంది ఆ అర్థం స్ఫురించే వ్యక్తి ఆదర్శం ఎలా అవుతాడని అందరూ నిర్గాంత పోవడం కాయం. వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు వుప్పాల నరసింహం 9985781799
Your experience on this site will be improved by allowing cookies.