రామగుండం 49వ డివిజన్లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రేపు (02-04-2026) ఉదయం 10 గంటలకు శారదా నగర్ గర్ల్స్ జూనియర్ కాలేజీలో వార్డ్ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలైన మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, గృహ జ్యోతి, వృద్ధాప్య మరియు వితంతు పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించబడతాయి. అర్హులైన ప్రజలు అవసరమైన పత్రాల జిరాక్స్ కాపీలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ సాగి సంతోష్ కుమార్ కోరారు.
బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ ను డంప్ యార్డ్ చేశారు. క్లీన్ చేసేవరకు ఇక్కడే కూర్చుంటాం. జనం గొంతు బ్యూరో చీఫ్ హైదరాబాద్ 28/03/26 శనివారం బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ ఇక్కడ ఉండబట్టి 24 ఏళ్ళు అవుతుంది. ఇక్కడికి రోజు పదివేల మంది కస్టమర్లు వచ్చి పోతుంటారు. సంవత్సరానికి 14 నుండి15 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే మార్కెట్ ఇది. గత తొమ్మిది నెలలుగా చెత్తను తీసుకువెళ్లే కాంట్రాక్టర్లు, టాయిలెట్స్ కడిగే కార్మికులకు డబ్బులు రాకపోవడం వల్ల వందల లారీల చెత్త పేరుకుపోయింది. ఆ మురిగిపోయిన కూరగాయల నుంచి వచ్చే దుర్గంధపూరితమైన నీళ్లు కాళ్ళ కిందకు వచ్చి పుండు పడిపోతున్నాయి. ఈ దుర్గంధపూరితమైన వాసన వల్ల కస్టమర్లు రావడం లేదు. మార్కెట్లో బిజినెస్ అంతా తగ్గిపోతుంది. మంత్రికి చెప్పినా, కమిషనర్ కి చెప్పినా ఈ సమస్య పరిష్కారం కాలేదు. ఇది కూరగాయల మార్కెట్ లాగా లేదు డంప్ యార్డ్ లాగా ఉంది. ప్రతినిత్యం రోగాలకు నిలయంగా ఉంది. మహిళ టాయిలెట్ కు వెళ్లాలంటే ఇంకో మహిళ కాపలా కాయాల్సి వస్తుంది. టాయిలెట్స్ కు నీళ్లు లేవు, డోర్లు లేవు అని మహిళలు చెబుతున్నారు. ఎంతో ఆరోగ్యపరంగా ఉండే ఈ మార్కెట్ యార్డ్ రోగాల నిలయంగా మారింది. ఇక్కడ కట్టిన వాటర్ ట్యాంక్ లో నీళ్లు లేవు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు, చెత్తను మోసేవారు లేరు. ఈ రోజు నేను వస్తున్నానని తెలిసి బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు తప్ప శాశ్వత పరిష్కారం దొరకలేదు. నేనిక్కడికి గంట రెండు గంటలు ధర్నా చేయడానికి రాలేదు. ఇక్కడ ఉన్న చెత్తంతా కూడా తీసేయాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీన్ చేయించాలి. శాశ్వతంగా అండర్ గ్రౌండ్ వ్యవస్థ పని చేసేంతవరకు, మంచినీళ్లు వ్యవస్థ మెరుగుపరిచే వరకు, కుళ్లిపోయిన కూరగాయలతో బయోగ్యాస్ తయారు చేసే ప్లాంట్ పునరుద్దించే వరకు, చెత్త కాంట్రాక్టర్లు డబ్బులు ఇచ్చి క్లీన్ చేసేంతవరకు, ఆరోగ్యవంతమైన మార్కెట్ ని చేసేంతవరకు నా ధర్నా కొనసాగుతుంది. ఈ సమస్య మొత్తం పరిష్కారం అయ్యేంతవరకు ఇక్కడే ఉంటాను. సమస్య పరిష్కరించే వెళ్తాను. అవసరమైతే మార్కెట్ యార్డ్ ను రెండు రోజులు బందు పెట్టైన మొత్తం శుభ్రం చేయాలని కోరుతున్నాను. మహిళలు మాట్లాడే మాటలు ప్రభుత్వం వింటే సిగ్గుతో తలదించుకోవాలి. ఫ్యూచర్ సిటీ, మూసి ప్రక్షాళన, లక్ష కోట్లు పెట్టి హైదరాబాదును సుందరీకరంగా చేస్తానన్న మిస్టర్ రేవంత్ రెడ్డి, ఈ మార్కెట్ యార్డ్ ను సాఫ్ చేసే కాంట్రాక్టర్లకు, టాయిలెట్స్ కడిగే కాంట్రాక్టర్లకు, చెత్తను తీసే కాంట్రాక్టర్లకు నెలకు ఏడు లక్షల ఇవ్వలేక తొమ్మిది నెలలు అవుతుంది ఇంతకంటే సిగ్గుమాలిన తనం ఏమీ లేదు. కాంట్రాక్టర్ వెళితే 10 శాతం ఇస్తేనే సంతకం పెడతా అని చెబుతున్నారంటే నీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. మీ సంపాదన...ఆ సంపాదనతో ఢిల్లీకి పంపించే ఆలోచన, అధికారం మీద ఉన్న ధ్యాస, బోయిన్పల్లి మార్కెట్ పైన లేదు అంటే సిగ్గుతో తలదించుకోవాలి. మీకు ఒక కళంకం ఇది. ఇంత ఆర్తనాదాలు, శాపనార్థాలతో, తిట్లతో, దుర్మార్గలతో మంత్రిగా కొనసాగడం కంటే రాజీనామా చేసి మాకు చేతకాదు అని చెప్పుకోవడం మంచిది. నేనిక్కడ ధర్నా చేస్తున్న. మీ కమిషనర్ను పంపిస్తావా, సెక్రెటరీ పంపిస్తావా...వెంటనే పంపించాలి. ఈ సమస్య పరిష్కారం చేయాలి లేకపోతే వేలాది మంది కార్మికులతో ఈ ధర్నా కొనసాగుతాదని హెచ్చరిస్తున్నాను.
గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలోని నరేంద్ర విద్యాలయం హై స్కూల్ లో ఇదే గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి సిరిపురం జగదీశ్ జెటివో గా ప్రభుత్వ ఉద్యోగం సాధించినందుకు పాఠశాల యాజమాన్యం గంగాధర రాజేశం గోపాల్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. శాలువాతో సత్కారం చేశారు. 10 సంవత్సరాలు పాఠశాల లో చదివి ఉన్నత చదువులలో రాణించి ప్రభుత్వ ఉద్యోగం పొందడం పాఠశాలకు గర్వ కారణమన్నారు. చిన్నప్పటి నుండి చదువులో మంచి ప్రతిభ కనబరిచే వాడాన్నారు. మంచి విద్యార్థిగా ఎదిగినప్పుడు సమాజం లో మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగి జెటివో గా బాధ్యతలు తీసుకొని ఇతర జిల్లాలో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా పాఠశాల అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
రామగుండం నగరంలో నీటి సరఫరా సమస్యలపై మేయర్ మహంకాళి స్వామి కఠినంగా స్పందించారు. శనివారం శారదా నగర్ పీజీ కళాశాల ఎదుట డిస్ట్రిబ్యూషన్ పైప్లైన్లలో ఏర్పడిన లీకేజీల మరమ్మత్తు పనులను ఆయన స్వయంగా ఫీల్డ్లో కూర్చొని పర్యవేక్షించారు. లీకేజీల కారణంగా ప్రశాంత్ నగర్ నుంచి పవర్ హౌస్ కాలనీ వరకు దాదాపు నాలుగు డివిజన్లలో నీటి సరఫరా అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో, సాయంత్రం లోపు పనులు పూర్తి చేయాలని అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. రేపటి నుంచి నీటి సరఫరా యథాతథంగా కొనసాగాలని స్పష్టం చేశారు. నగరంలో ఎక్కడైనా లీకేజీలు గుర్తించిన వెంటనే 9392483959 నంబర్కు సమాచారం ఇవ్వాలని, ఫోటో తీసి లొకేషన్తో వాట్సాప్ చేయాలని ప్రజలను కోరారు. మున్సిపల్ సేవలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఇదే నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, ప్రతి కనెక్షన్కు వాల్వ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వేసవిలో నీటి కొరత లేకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నామని మేయర్ తెలిపారు.
-: బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇరాన్ (పశ్చిమాసియాలో) యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్నప్పటికీ, మన దగ్గర పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా నిర్ధిష్ట చర్యలు తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. ఇరాన్ యుద్ధం నేపధ్యంలో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన ధరలుపెరుగుతాయేమో, ఇంధన కొరత ఉంటుందేమో అని నిన్నటి వరకు ప్రజలు ఆందోళన చెందారు. అయితే ఎల్లప్పుడూ ప్రజల బాగోగుల గురించి ఆలోచించే మన ప్రధాని నరేంద్ర మోదీ గారు సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకూడదని, పెట్రోల్, డీజిల్ కొరత తలెత్తకుండా చూడడమే కాకుండా, వాటి ధరలు కూడా పెరగకుండా నిర్ధిష్ట చర్యలు తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ గారు మాత్రం పెట్రోల్ పై ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.13 నుంచి రూ.3కి తగ్గించారు. అలాగే, డీజిల్ పై లీటరుకు రూ.10గా ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించారు. దీంతో, ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలుపెరుగుతాయేమో అని ఆందోళనకు గురైన సమాన్య వినియోగదారులందరికీ భారీ ఊరట కలిగింది. ఒక్క పైసా కూడా ధరలు పెరగకుండా పన్నులు తగ్గించిన ప్రధాని నరేంద్ర మోదీ గారు, అసలు ఎలాంటి కొరత కూడా లేకుండా గల్ఫ్ ప్రాంతం నుంచి మన దేశానికి చమురు సరఫరా సాఫీగా జరిగేలా మన విదేశాంగ విధానాన్ని అమలు చేస్తున్నారు. గల్ఫ్ ప్రాంతం నుంచి ఇతర దేశాలకు చమురు సరఫరాలో ఆటంకాలు ఏర్పడ్డాయి. కొన్ని దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తింది. కానీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సమర్ధ నాయకత్వం, దూరదృష్టి, ఇరాన్ వంటి దేశాలతో ఉన్న సత్పంబంధాలు పెట్టుకునేటి వంటి విదేశాంగ విధానాన్ని అమలు చేయడం ద్వారా మన దేశంలో ఇంధన సంక్షోభం రాకుండా చేయగలిగారు. అయినప్పటికీ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మన దేశంలోని ఆయిల్ కంపెనీలకు గల్ఫ్ నుంచి చమురును దిగుమతి చేసుకునే వ్యయం పెరిగింది. దాంతో ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజల్ ధరలను పెంచుతాయేమో అనే కలవరం ప్రజలను వెంటాడింది. అయితే ఎల్లప్పుడూ ప్రజల బాగోగులకే ప్రధాన్యత ఇచ్చే మన ప్రధాని నరేంద్ర మోదీ గారు తక్షణమే స్పందించి, పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించడమే కాకుండా డీజిల్ పై ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించడం ద్వారా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి సామాన్యుల ప్రయోజనాలే ముఖ్యమని మరోసారి రుజువు చేసారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా ఉపశమనం కలిగించిన. అసలు ఇంధన కొరతే రాకుండా సామాన్యులకు పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉండేలా నిర్ధిష్ట చర్యలు తీసుకున్న మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి మనమంతా ధన్యవాదాలు తెలపుకోవాలి.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50వ డివిజన్లో ఈరోజు సాయంత్రం మున్సిపల్ సిబ్బంది చేత విస్తృతంగా ఫాగింగ్ కార్యక్రమం నిర్వహించారు. దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను నివారించేందుకు ముందస్తు చర్యగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం కార్పొరేటర్ ధూళికట్ట సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి చర్యలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ప్రజలందరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచి, ఎక్కడా నిల్వ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రామగుండం నియోజకవర్గం, అంతర్గాం మండలం: అకెనపల్లి గ్రామంలోని హనుమాన్ గుడి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సీతారాములు పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెగా ముస్తాబై భక్తులకు దర్శనమిచ్చారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య జరిగిన ఈ దివ్య కళ్యాణాన్ని చూసేందుకు అశేష భక్తజనం భారీగా తరలివచ్చారు. ఈ మహోత్సవంలో అమ్మవారి తరపున సర్పంచ్ గాదె స్రవంతి-సుధాకర్ దంపతులు, స్వామివారి తరపున నల్లపు సునీత-మహేందర్ దంపతులు కన్యాదాన, కళ్యాణ క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీతారాములకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తూ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. ఈ వేడుక గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకుంది. కళ్యాణానంతరం భక్తులకు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, వందలాది మంది ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం సాయంత్రం గ్రామ పురవీధుల్లో శ్రీ సీతారాముల శోభాయాత్ర ఘనంగా సాగింది. మంగళహారతులు, భజన కీర్తనలతో గ్రామం మొత్తం రామనామ స్మరణతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, వార్డు సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు
శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని రాం మందిర్ శ్రీ రామాలయంలో వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గోదావరిఖని కిరాణ మర్చంట్ అసోసియేషన్ మరియు రైస్ మిల్లర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులకు ఉచితంగా పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు. గత 12 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమం ఈ ఏడాది కూడా అదే ఉత్సాహంతో నిర్వహించబడింది. కార్యక్రమం విజయవంతం కావడంలో ప్రియతమ నాయకులు, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ నేతృత్వం కీలకంగా నిలిచింది. మేయర్ మహంకాళి స్వామి, కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ సహకారంతో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పూజలు, ప్రత్యేక హోమాలు, భజనల మధ్య భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి శ్రీరాముడి దర్శనం పొందారు. అనంతరం అందరికీ ప్రసాదంగా పులిహోరను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిరాణా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు చొక్కారపు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి చిట్టిమల్ల కిషోర్ కుమార్, కోశాధికారి రేణికుంట చందర్, ఉపాధ్యక్షులు నగునూరి సత్యప్రసాద్ మరియు ఇతర సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
రామగుండం నగరంలో వేసవి కాలంలో నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మేయర్ మహంకాళి స్వామి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి వేసవిలో నీటి ఎద్దడి వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించారు. వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం అవసరమైన నిధుల అంచనాలు సిద్ధం చేసి, సకాలంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ఇటీవల కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు ప్రస్తావించిన సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని వెంటనే పరిష్కరించాలని చెప్పారు. వీధి దీపాల నిర్వహణలో ఎనర్జీ సేవింగ్పై దృష్టి పెట్టాలని, వాహనాల మరమ్మత్తులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి శానిటేషన్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ ఎస్ఈ గురువీర, ఈఈ పి.వి. రామన్, డీఈలు ఆఫ్తాబ్, శాంతి స్వరూప్, జగదీష్, షాబాజ్, ఏఈలు జమీల్, తేజస్విని, మీర్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరిఖని వన్టౌన్ శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించనున్న శ్రీరామ కళ్యాణోత్సవానికి పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ ఏర్పాట్లను గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పండుగ రోజు భక్తుల భారీ రద్దీ ఉండనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ఆలయం పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించి, భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, బ్యారికేడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక దారులు కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా ట్రాఫిక్ రద్దీ నివారణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టి భక్తులకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పార్కింగ్కు ప్రత్యేక స్థలాలు గుర్తించి సూచనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే సమీప పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఆలయంలో నిబంధనలు పాటిస్తూ, క్యూలైన్లలో శాంతిగా దర్శనం చేసుకోవాలని కోరారు. పండుగను శాంతియుతంగా, సుఖశాంతులతో జరుపుకునేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఏసీపీ విజ్ఞప్తి చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో గోదావరిఖని వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ఇతర పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.