విజయ సంకల్ప యాత్రతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బిజెపి నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర పెనుమార్పులు తీసుకొస్తుందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కే.లక్ష్మణ్ గారు చెప్పారు. శుక్రవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం లో మీడియాతో మాట్లాడారు. కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే రాజకీయాల్లో రాణించి.. తాను ఎమ్మెల్యేగా పని చేస్తున్న కాలంలో కార్పొరేటర్ గా పనితీరులో ఆకట్టుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికై ఎంతో రాజకీయ భవిష్యత్ ఉన్న లాస్య అకాలమరణం కలిచి వేసిందన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో బిజెపి నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రకు పార్టీలకు అతీతంగా మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలుకుతున్నారని వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వేరువేరు పార్టీలకు ఓటేసినప్పటికీ ప్రజలు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మోదీ కోసం మేమున్నామంటూ కదులుతున్నారని.. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలు బిజెపికే వస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు. యాత్ర సాగుతున్న ప్రతి పల్లెలోని ప్రజలు దివ్యమైన రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసిన మోదీ గారికే మా మద్దతని స్పష్టంగా చెబుతున్నారన్నారు. విజయ సంకల్పయాత్ర పొడుగునా.. తెలంగాణ ప్రజలు ఆప్ కీ బార్...చార్ సౌ పార్ అంటూ.. ఫిర్ ఏక్ బార్ అంటే మోదీ సర్కార్ అంటు బదులిస్తున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ విజయ సంకల్ప యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది. నాలుగు క్లస్టర్లలలో ఆరు పార్లమెంట్ల పరిధిలో 45శాసనసభ నియోజకవర్గాలలో యాత్ర సాగిందని వివరించారు. మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మోదీ సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ విజయ సంకల్ప యాత్ర దోహదపడుందని ఆశాభావం వక్తం చేశారు. బాల రాముడి విగ్రహ ప్రతిష్టలో కాంగ్రెస్ నాయకులు పాల్గొనకపోవడంతో గ్రామాల్లోని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రధానమంత్రిగా, 140కోట్ల ప్రజల ప్రతినిధిగా నిష్టతో నరేంద్రమోదీ గారు పూజలో పాల్గొంటే ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రతిపక్షాలకు బుద్ధి రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్ల నరేంద్ర మోదీ పాలనలో అభివృద్ధి కనిపిస్తోంది. గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధులిస్తున్నట్లు సర్పంచులు కూడా చెప్పడం మోదీ పాలనకు గీటురాయి వంటిదన్నారు. ఈ విజయ సంకల్ప యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొని రావడం ఖాయమన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి చిట్టా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న విధానాలను విజయ సంకల్ప యాత్రలో ప్రజలకు వివరిస్తూ వారి జాగృతం చేస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నాయిన పనిలేని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేయించడంపై డాక్టర్ కే.లక్ష్మణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలానే ప్రజలను దృష్టి మళ్లించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. విజయ సంకల్ప యాత్రలో ప్రజల నుండి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వారి ఆటలు సాగబోవన్నారు. పదేండ్ల మోదీ పాలనలో 25కోట్ల మందిని పేదరికం నుండి గట్టెక్కారని ప్రధాని విజయాలను ఏకరువు పెట్టారు. కాంగ్రెస్ అంటేనే అవినీతి, కుంభకోణాలు, వంశపారపర్య రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, హిందువుల మనోభావాలను దెబ్బతీసే రాజకీయాలు పాల్పడడం తప్ప వేరే ఏం లేదని తీవ్రంగా దుయ్యబట్టారు. గ్యారంటీలను అమలు చేయడం చేతకాని రేవంత్ ప్రభుత్వం ..పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తినే ఆరు గ్యారెంటీలు అమలుకు సాధ్యమవుతుందని అనడం దివాళాకోరు తనానికి నిదర్శనమన్నారు. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారని డాక్టర్ కే.లక్ష్మణ్ గారు ఎద్దేవా చేశారు. తలాతోక లేని కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, అవినీతిలో పేరుకపోయిన పార్టీలు, బెయిల్ మీద బయట తిరుగుతున్న నాయకులందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి మోదీ గారిని మూడోసారి ప్రధానిగా కాకుండా నిలువరించాలని కుట్ర పన్నుతున్నా.. ప్రజల ఆశీస్సులతో అధిగమించడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ తో కలిసి తెలంగాణలో మోదీ గారి గెలుపు ఆపాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తునక్నా.. విజయ సంకల్ప యాత్ర రథ చక్రాల కింద బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నలిగి పోతాయని జోస్యం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి, ఇసుక మీదదోపిడి చేసిన బీఆర్ఎస్ నాయకుల అవినీతిని కక్కిస్తామని చెప్పి ఇప్పుడు లోపాయికారి ఒప్పందాలు చేసుకొని దిగజారు రాజకీయాలు చేస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి దోపిడిని బయట పెడ్తామని ఎన్నికల సమయంలో ప్రస్తావించిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని కాపాడే ప్రయత్నాలు చేయడం దగాకోరుతనానికి పాల్పడున్నారని విమర్శలు గుప్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు, దళితులకు ఇచ్చిన భూములు లాగేసుకొని ప్రాజెక్టుల పేరు మీద పెట్టుబడుదారుల చేతిలో పెట్టింది. వాటి మీద కాంగ్రెస్ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. చేవెళ్ల పార్లమెంటులోని సీతారామపూర్ గ్రామంలోని 1,110 ఎకరాల దేవాలయ భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యాపారవేత్తలకు అప్పనంగా అప్పజెప్పిందని, రాముడి భూములను కూడా కాపాడడం లేదని అక్కడి ప్రజలు వాపోతున్నా దేవాలయ భూముల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఊసెత్తడం లేదన్నారు. భారతీయ జనతా పార్టీ తరుఫున రాబోవు రోజుల్లో దేవాలయ భూముల మీద ఉద్యమం చేస్తామని డాక్టర్ కె. లక్ష్మణ్ గారు హెచ్చరించారు. రెండు నెలలు గడిచినా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలపై విధాన పరమైన నిర్ణయాలు తీసుకోలేదు. ఇందిరమ్మ ఇళ్ల ఊసే లేదు...రైతు బంధు పూర్తిస్థాయిలో రైతులకు అందలేదని తెలిపారు. రైతులకు రుణమాఫీ చేయడం లేదన్నారు. మోదీ విజయాలు.. పదేండ్లలో దేశంలో అభివృధ్ధి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పన.. పదేండ్లలో తెలంగాణకు రూ. 9.26లక్షల కోట్ల నిధులు. రామగుండంలో రూ. 6,338 కోట్లతో ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరణ తెలుగు రాష్ట్రాలలో 4 వందే భారత్ రైళ్లను ప్రారంభం.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించపోయినా రూ.1,153 కోట్ల ఖర్చుతో ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనుల పూర్తికి కేంద్రం నిబద్ధత.. కాజీపేటలో రూ. 521 కోట్లతో రైల్వే వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ప్రారంభం. 348కి.మీల రీజినల్ రింగ్ రోడ్ ను పూర్తికి ఆమోదం.. రూ.442 కోట్లతో రామగుండంలో 100మెగావాట్ల పవర్ ప్లాంట్ మంజూరు.. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు .. భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఎయిమ్స్‌ ఏర్పాటుతో అందుబాటులోకి ప్రతిష్టాత్మక వైద్య సేవలు రూ.50,848 కోట్లతో తెలంగాణలో 15 కొత్త రైల్వేలైన్లు.. అంతర్జాతీయ స్థాయిలో అమృత్ భారత్ స్టేషన్ స్కీంలో భాగంగా మారిన తెలంగాణ రైల్వే స్టేషన్ల రూపు రేఖలు .. కొమురవెల్లి మల్లన్న భక్తుల కోసం రైల్వే స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన. రూ.1.20లక్షల కోట్లతో తెలంగాణలో నేషనల్ హైవేస్ రూ.21వేల కోట్లతో హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్ మంజూరు రూ. 715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి.. రూ. 221 కోట్లతో చర్లపల్లి టర్మినల్ అభివృద్ధి రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు.. తెలంగాణలో 11లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కలెక్షన్లు కోటి మందికి జన్ ధన్ ఖాతాలు.. 60లక్షల మంది ముద్ర యోజన కింద లభ్ధి యువత కోసం వైద్య కళాశాలల అభివృద్ధి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఇవన్నీ ప్రస్తావించకుండా వాళ్ల స్థాయిని తగ్గించుకొని కేవలం చవకబారు రాజకీయాలు చేయడంపై డాక్టర్ కే లక్ష్మణ్ గారు మండిపడ్డారు.