జనం గొంతు //ఓదెల// సతీష్ కుమార్ ఆమ్యామ్యాలతో అడ్డగోలు ఇసుక దోపిడి స్థానికులు, విలేకరుల సమక్షంలో బయటపడిన అక్రమాలు మానేరు నది అక్రమార్కుల పాలిట వరంగా మారింది. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ ఇసుక కాంట్రాక్టర్లు జేబులు నింపు కుంటున్నారు. నిబంధనలు కఠినంగా అమలు పరచాల్సిన టిఎస్ఎండిసి అధికారులు అవినీతి మత్తులో మునిగి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే... పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం లోని గుండ్లపల్లి ఇసుక క్వారీలో జరుగుతున్న అక్రమాలపై స్థానిక రైతులు చేసిన ఫిర్యాదు మేరకు విలేకరులు ఇసుక క్వారీని పరిశీలించగా అనేక అక్రమాలు బహిర్గతమయ్యాయి. ఎన్నో లారీలు క్వారీ బయట క్యూ కట్టి తమ వంతు కోసం ఎదురు చూస్తుంటే జీరో దందాతో నడిచే కాంట్రాక్టర్ల లారీలు మాత్రం రాజమార్గంలో ఓవర్ లోడ్ తో ఇసుకను నింపుకొని దర్జాగా వెళుతున్నాయి. విలేకరులు పరిశీలన ప్రారంభించేసరికి సుమారు 30 లారీలు ఇసుకను లోడ్ చేసుకోకుండానే వెనుతిరిగాయి. ఆ లారీ యజమానులు ప్రభుత్వానికి ఎలాంటి డీడీలు చెల్లించకుండానే వారి వద్ద కాంట్రాక్టర్లకు మామూళ్లు చెల్లించి లారీల నిండా ఇసుకను నింపుకొని ఓవర్ లోడుతో జీరో దందా నడుస్తున్నట్లు స్థానిక రైతులు ఆరోపించారు. సమయపాలన లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో కాంట్రాక్టర్లు ఇసుక క్వారీలో తమ దోపిడీని కొనసాగిస్తుంటే, చర్యలు చేపట్టాల్సిన టిఎస్ఎండిసి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం వెనుక మతలబు ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దందా నిత్యం మూడు బకెట్లు 30 వేలుగా కొనసాగుతోందని వారు సెలవిచ్చారు. స్థానికులు మరియు విలేకరులు అందించిన సమాచారం మేరకు ఎన్జీటీ పిటిషన్ దారులు చిటికేసి సతీష్ కుమార్ మరియు సురేందర్ రెడ్డిలు గుండ్లపల్లి ఇసుక క్వారీని సందర్శించి పరిశీలించగా.. ఓవర్ లోడుతో లారీలు వెళుతున్నట్టు స్పష్టమైనది. 26 టన్నుల ఇసుక కొరకు డీడీలు చెల్లించిన ఒక లారీ యజమాని నుండి క్వారీ నిర్వాహకులు వేల రూపాయలు లంచంగా తీసుకొని సుమారు 15 టన్నుల ఇసుకను అధికంగా అతని లారీలో లోడ్ చేశారు. ఇట్టి అక్రమ వ్యవహారంపై టిఎస్ఎండిసి ప్రాజెక్టు అధికారులకు ఫిర్యాదు చేయగా వే బ్రిడ్జిలో లోపం ఉందని, బరువు సరిగా తూచడం లేదని క్వారీ యజమానులకు వత్తాసు పలుకుతూ దాటవేశారు. ఇప్పటికైనా అక్రమాలకు నిలయమైన ఇసుక క్వారీలను మూసివేయాలని లేదంటే కనీస నిబంధనలు పాటిస్తూ అవినీతికి తావు లేకుండా నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేల్పుల శ్రీనివాస్ యాదవ్, స్థానిక రైతులు పొల్లూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.