సింగరేణి ప్రభావిత గ్రామమైన జనగామ అభివృద్ధిపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించి గ్రామ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 6వ డివిజన్ కార్పొరేటర్ ఆవుల తోకల శ్యామిని రమేష్ ఆధ్వర్యంలో గురువారం సింగరేణి ఆర్జీ-1 జనరల్ మేనేజర్కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ ఆవుల తోకల శ్యామిని రమేష్ మాట్లాడుతూ సింగరేణి కంపెనీ అభివృద్ధి కోసం జనగామ గ్రామ ప్రజలు తమ భూములను త్యాగం చేశారని, అయినప్పటికీ గ్రామ అభివృద్ధి విషయంలో సరైన చర్యలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.గ్రామంలో మూతపడిన ఆర్.ఓ ప్లాంట్ను పునరుద్ధరించాలని, ఊర చెరువు కట్టను వెడల్పు చేసి మెటల్ రోడ్డు నిర్మించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. క్రీడా మైదానంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసి ప్రహరీ గోడ నిర్మించాలని, ప్రభుత్వ దవాఖాన ఆవరణలో మట్టి పోసి చదును చేయాలని కోరారు.అదేవిధంగా దోబీ ఘాట్ మరియు ఎల్లమ్మ దేవాలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, స్మశాన వాటికలో షెడ్ ఏర్పాటు చేయాలని, మహిళా సంఘ భవనం కోసం సింగరేణి స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో పాత సోలార్ లైట్లకు మరమ్మతులు చేసి కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు.ఈ సమస్యలపై సింగరేణి జీఎం సానుకూలంగా స్పందించి త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కలవేన రవీందర్, జనగామ మహేందర్, ఆర్కే నేత, ఊదరి రవీందర్, గుండెబోయిన సదన్ కుమార్, అర్కూటి రాజయ్య, డాక్టర్ గంజి చక్రపాణి, సిద్ద తిరుపతి, నీలి తిరుపతి, అరెళ్ల రవితేజ, జనగామ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Comments 0