చెత్త రహిత రామగుండం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని రామగుండం శాసన సభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద నిర్వహించిన 5కే రన్‌ను మేయర్ మహంకాళి స్వామితో కలిసి ఆయన ప్రారంభించారు. నగర పాలక సంస్థ కార్యాలయం నుండి గోదావరిఖని చౌరస్తా వరకు రన్ నిర్వహించగా, అనంతరం చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రమైన, సుందరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నగర పాలక సంస్థ స్వచ్ఛ వాహనాలకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, అధికారులు, ఎన్‌సీసీ–ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, నగర పాలక సంస్థ సిబ్బంది మరియు పీజీ కాలేజీ గ్రౌండ్ వాకర్స్ పాల్గొన్నారు.