రోడ్డు నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్ నుండి రికవరీకి ఆదేశం జనం గొంతు//ఓదెల// పెద్దపల్లి పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కనగర్తి గ్రామంలో సుమారు రెండు కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన రోడ్డులో పలు అవకతవకలు జరిగాయి అంటూ గ్రామానికి చెందిన చిటికేసి సతీష్ కుమార్ హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సీఎం కార్యాలయం దీనిపై విచారణకు ఆదేశించగా పెద్దపల్లి రహదారులు మరియు భవనాల శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో విచారణ జరిపి, రోడ్డు నిర్మాణంలో తగు ప్రమాణాలు పాటించ బడలేదని నిర్ధారిస్తూ కాంట్రాక్టర్ జెఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ నుండి 5 లక్షల 79 వేల 224 రూపాయలు రికవరీకి ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రజావాణి ఫిర్యాదు తదుపరి ఎలాంటి విచారణ జరపకుండానే ఆర్ అండ్ బి ఉన్నతాధికారులు కాంట్రాక్టర్ తో కుమ్మక్కై నామమాత్రపు రికవరీ విధించి చేతులు దులుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుడు చిటికేసి సతీష్ కుమార్ మాట్లాడుతూ.. కనీసం 50 లక్షల విలువగల పని సైతం చేయకుండానే కాంట్రాక్టర్ కోట్లాది రూపాయలను జేబులో వేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.టిఎస్ఎండిసి అధికారులు గతంలో ఈ రోడ్డు మరమ్మత్తులకు వెచ్చించిన మొత్తాన్ని సైతం కాంట్రాక్టర్ తన ఖాతాలో వేసుకొని దాని పైననే అరకొరగా పనులు నిర్వహించి రోడ్డు నిర్మాణంలో కోట్లాది రూపాయలు దండుకున్నారని తెలిపారు. కనగర్తి రోడ్డు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ విచారణ జరిపించాలని 22 డిసెంబర్ 23 తేదీ న తాను ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే, 13 సెప్టెంబర్ 2023 రోజున విజిలెన్స్ విచారణ జరిపి రికవరీకి ఆదేశించామని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. నిజానికి సీఎం కార్యాలయం నుండి ఆదేశాలు వెలువడిన అనంతరం క్షుణ్ణంగా విచారణ జరిపించాల్సిన అధికారులు అవేమీ పట్టించుకోకుండా కాంట్రాక్టర్ తో కుమ్మక్కై, తమ తప్పిదాలు వెలుగులోకి రాకూడదు అనే దురుద్దేశంతో, పాత తేదీతో ఉత్తర్వులు సృష్టించి నామమాత్రపు రికవరీకి ఆదేశించి ఆర్ అండ్ బి అధికారులు తమ అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు ఎలాంటి విచారణ జరిపించకుండానే సీఎం కార్యాలయాన్ని సైతం తప్పుదోవ పట్టించే విధంగా, సెప్టెంబర్ నెలలోనే విజిలెన్స్ విచారణ జరిపించామని కాంట్రాక్టర్ నుండి రూపాయలు రికవరీకి ఆదేశించామని తెలుపుతూ ఉత్తరం సృష్టించి చేతులు దులుపుకోవడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. కొండంత అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్ నుండి గోరంత రికవరీ కి ఆదేశించడం ఏమిటని వాపోయారు. గ్రామంలో ప్రజల సమక్షంలో సామాజిక తనిఖీ చేపడితే, రోడ్డు నిర్మాణంలో జరిగిన అక్రమాలన్నీ బహిర్గతం కాగలవని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ఈ రోడ్డు నాణ్యతను స్వయంగా పరిశీలించి, మొత్తం రికార్డులను సరిచూసి అక్రమాలకు పాల్పడిన అధికారులు మరియు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేనియెడల కాంట్రాక్టర్ తో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడిన ఆర్ అండ్ బి అధికారులపై న్యాయపోరాటం చేయగలనని హెచ్చరించారు.
Comments 0