సమతమమత కొరకు సన్యాసిగా నిల్చి జైనమతబోధ జనులకొసగి సార్ధకమ్మునొంది వర్ధమానుండయ్యె శాంతికేతనంబు సమరసంబు జైన సంప్రదాయానికి మూలమైన సిద్ధాంతాన్ని ఆత్మవాదమని అంటారు. ఇందులో మనిషి క్రోధం, కామం, ఈర్ష్య, అసూయ మొదలైన వాటిని జయించాలి. ఇలా జయించిన వారికి జినుడు అని పేరు. ‘జినుడు’ అన్నమాట నుంచి వచ్చిన పదం జైనం. జినుడు అంటే జయించినవాడు అని అర్థం. జినుడు అయిన వ్యక్తి స్థాపించిన మతం కనుక దీనిని జైన సంప్రదాయం అంటారు. ఈ సంప్రదాయంలో 24 తీర్థంకరులు ఉన్నారు. వీరిలో 24 వ మరియు ఆఖరి తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. బీహార్లో వైశాలికి సమీపంలోని కుందల గ్రామంలో క్రీ.పూ. 599లో జ్ఙాత్రికుల క్షత్రియ కుటుంబానికి చెందిన సిద్దార్ధుడు, త్రిషలకు మహావీరుడు జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు మహావీరుడని నామకరణం చేశారు. అల్లారుముద్దుగా పెరిగిన మహావీరుడు తల్లిదండ్రులు అతడి 28వ ఏట మరణించగా, యశోధరను వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె జన్మించగా, తన 36 వ ఏట వర్ధమానుడు సన్యాసాన్ని స్వీకరించాడు. 12 ఏళ్లు పాటు కఠోర తపస్సు చేసి, వైశాఖ మాసం పదమూడో రోజున జృంభిక గ్రామంలో జ్ఙానోదయం కలిగింది. తరువాత మహావీరుడు జినుడు అయ్యాడు. తరువాత ముప్పై ఏళ్లు కోసల, మగధ రాజ్యాలతోపాటు తూర్పునకు వెళ్లి తన సిద్ధాంతాలను బోధించాడు. బింబిసారుడు, అజాత శత్రువు మొదలైన రాజులను కలుసుకున్నాడు. తన పర్యటనలో వర్ధమానుడు జైనతత్వాన్ని ప్రచారం చేశాడు.వ్యక్తి ఆనందానికి, సామాజిక జీవనానికి సంబంధించిన శుభ సందేశాన్ని ప్రబోధించాడు. వర్ధమానుని బోధనలలో సమత్వం మహావీరుడు సమస్తజీవులకు హితం కల్గించే సిద్ధాంతమే నిజమైన ధర్మమని ఉద్భోదించాడు.సాత్వికప్రేమతో కూడిన అహింసని ప్రచారం చేశాడు. ఆ కాలంలో జరుగుతున్న దురాచారాల్ని అరికట్టి సర్వసమతావాదాన్ని ప్రచారం చేశాడు. ఆయన కులం,గోత్రం,ధనం,మతం,హోదా మొదలైన వాటిని లెక్కచేయకుండా సమస్త ప్రజలకు సమత శాంతిని ప్రసాదించాడు. వర్ధమానుని బోధనల్లో ప్రధానమైనవి అహింస, సత్యం, అపరిగ్రహం, అస్తేయం, బ్రహ్మచర్యం. వీటిని పంచ వ్రతాలు అంటారు. బ్రహ్మచర్యం పాటిస్తూ హింస చేయకుండా, అబద్ధమాడకుండా, ఇతరుల ఆస్తిని కబళించకుండా, దొంగతనం చేయకుండా ఉండాలి. జైన మతానుసారం సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ జీవనం అనే మోక్ష మార్గాలను త్రిరత్నాలంటారు. త్రిరత్నాలు సామాజిక వ్యవస్థని, సౌబ్రాత్వ మార్గంలో నిలబెట్టే అద్భుత సాధనాలు. వ్యక్తులు సరైన ద్రుష్టి కల్గి ఉండి, సరైన జ్ఞానంతో, సరైన జీవనాన్ని గడపాలనేది వీటి అర్ధం. వీటిని పాటిస్తూ పంచవ్రతాలతో జీవించేవారికి కైవల్యం లభిస్తుందని మహావీరుడు బోధించేవాడు. తన బోధనల వ్యాప్తికి మహావీరుడు సాధు, సాధ్వి, శ్రావక, శ్రావిక అని చతుర్విధ సంఘాలను స్థాపించాడు. వర్ధమానుడు సిద్ధాంతాలను ప్రబోధించేందుకు ఒకచోటి నుండి మరోచోటికి నిరంతరమూ ప్రయాణం చేసేవాడు. ఆ సమయంలో ఎందరో అతణ్ని పరిహసించారు. సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆయన్ని బాధించేవారు, అవమానపర్చేవారు. అయినప్పటికీ సహనంతో సంస్కరణకు పూనుకున్నాడు. ఇంద్రభూతి, అగ్నిభూతి, వాయుభూతులనే మహాపండితులతో శాస్త్ర చర్చలు జరిపాడు."మానవ జాతికి విముక్తి కావాలంటే ప్రేమ,మమత,సమత- అనేవి అవసరం అన్నాడు మహావీరుడు. వర్ణం ప్రధానం కాదనీ, ఆధ్యాత్మిక ఉన్నతికి వర్ణంతో సంబంధం లేదనీ చాటి చెప్పాడు". తర్వాత వారే మహావీరుని ప్రముఖ శిష్యులుగా మారిపోయారు. మహావీరుని ఉపదేశాలను అక్షరబద్ధం చేసిన గౌరవం ఇంద్రభూతికే దక్కుతుంది. హరికోశి, మైత్రార్యుడు అనే శూద్రులు సైతం ఆయన శిష్యులలో ఉండేవారు. నిష్కారణంగా ఇతరులతో వైరభావం కలిగి ఉండేవాడు ప్రపంచంలోని అందరిలో అయోగ్యుడు అని ప్రవచించిన వర్ధమానుడు తన 72వ ఏట క్రీ.పూ.527లో పావాపురిలో దేహాన్ని త్వజించారు. అప్పటికే 23 మంది తీర్ధంకరులు ఉన్నా మహావీరుడు హాయంలోనే జైనమతానికి విశేష ప్రాధాన్యత లభించి, భారతదేశం నలుచెరుగులా వ్యాపించింది . 32ఏళ్ల పాటు సమతాధర్మంతో ప్రచారం జరిపిన మహావీరుడు జైనులకు ఆరాధ్యుడయ్యాడు.ఆయన నిజంగానే మహావీరుడు. కానీ యుద్ధాల్లో గెలిచిన క్షత్రియ వీరుడు కాదు.సమస్త ప్రజల హితం కోసం జీవించిన వీరుడు. అరిషడ్వర్గాలనీ జయించిన వీరుడు. ప్రతి ఒక్కరి హృదయాలయంలో కొలువైన దేవుడు! భారతీయ తాత్విక మతంగా విరాజిల్లుతున్న జైనం...సకల జనుల ధార్మికసమృద్ధి కోసమే!! సర్వ ప్రాణుల సమతా కేతనమే! ఆ కేతనం చేతబూని కార్యరంగంలోకి దూకుదాం... సామాజిక దురాచారమైన అంటరానితనాన్ని దూరం చేద్దాం. @ సాకి.
Comments 0