సోషల్ మీడియాలో జాతీయ వాద ప్రభావం కీలకం అని పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు.సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సోషల్ మీడియా సంగమం స్థానిక ఫిల్మ్ భవన్ లో ఈరోజు (తేదీ 3-3-2024, ఆదివారం) జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ భీమనాతిని శంకర్ ఆర్ఎస్ఎస్ కరినగర్ విభాగ్ సంఘ్ చాలక్ గారు పాల్గొని ప్రసంగిస్తూ నేటి యువత సోషల్ మీడియాలో మరింత క్రియాశీలంగా ఉండాలని చెప్పారు. అనంతరం ముఖ్యఅతిథి సీనియర్ జర్నలిస్ట్ సురేశ్ కొచ్చాటిల్ గారు ప్రసంగిస్తూ సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి కాబడుతున్న అనేక అబద్ధపు ప్రచారాల్ని తిప్పికొట్టాలని అసలు నిజాల్ని సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత జాతీయవాదులైన ప్రతీ ఒక్కరిపైనా ఉందని, ప్రతీ జాతీయవాది సోషల్ మీడియాలో నిజమైన దేశచరిత్రను,దేశ సామాజిక-సాంస్కృతిక చరిత్రను మరియు దేశంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని,సాంఘిక-సంక్షేమ పథకాలను వాటి ఉద్దేశ్యాలను ప్రయోజనాలను లబ్ధిదారులకు తెలియజేసి దేశహితం కోసం పాటుపడాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు.జాతీయవాదం బలపడితేనే మనదేశం విశ్వగురు స్థానాన్ని చేరుకోగలదని,గత వైభవాన్ని సాధించగలమని ఇందుకోసం ప్రతీ జాతీయవాది సోషల్ మీడియాను మాధ్యమంగా మలచుకోవాలని తెలిపారు.ఇదే కార్యక్రమంలో సామాజిక కార్యకర్త కట్టా రాజగోపాల్ గారు మాట్లాడుతూ మనదేశ సాంస్కృతిక మూలాలు గొప్పవని వాటిని ప్రస్తుత తరంవారు ఖచ్చితంగా తెలుసుకోవాలని తెలిపారు. దేశ విచ్చిన్నతకు జరుగుతున్న అనేక కుట్రలను ఎదుర్కోవాలని సూచించారు. కులం, వర్గం, ప్రాంతం, భాష పేరుతో జరిగే విభజన వాదాలను తార్కికంగా తిప్పికొట్టాలని చెప్పారు. అంబేడ్కర్ పేరుతో జరుగుతున్న సాంస్కృతిక విధ్వంసం, అంబేడ్కర్ ఏనాడూ కోరలేదని ఉదాహరణలతో వివరించారు. జాతీయ భావ విస్తరణ వలనే విభజన శక్తులన్నీ తోక ముడుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిరంజనా చారి,ఎలగందుల సత్యనారాయణ మరియు సమాచార భారతి కార్యకర్తలు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.