"హిందువులందరూ సోదరులే, ఏ హిందువు పతితుడు కాదు" అనే మంత్రాన్ని చాటి చెప్పిన మహానీయుడు. పీఠాధిపతులందరిచే హిందూధర్మంలో అంటరానితనానికి తావు లేదని ప్రకటింపజేసిన నిశ్శబ్ద చైతన్య మూర్తి. ఆయనే గురూజీ గా ప్రసిద్ధి గాంచిన మాధవ సదాశివ గోల్వాల్కర్.శ్రీ గురూజీ నాగపూర్ సమీప రాంటెక్ లో 1906 ఫిబ్రవరి 9న జన్మించారు. తండ్రి పేరు సదాశివ, తల్లి పేరు లక్ష్మీబాయి. తండ్రి ఉద్యోగ బదిలీల వల్ల గురూజీ ప్రాథమిక విద్యాభ్యాసం అనేక స్థలాలలో జరిగింది. ఉన్నతవిద్యను కాశీ విశ్వవిద్యాలయంలో కొనసాగించారు. అక్కడ జంతుశాస్త్రంలో ఎమ్మెస్సీ పట్టా 1928 లో పుచ్చుకున్నారు. కాశీ విశ్వవిద్యాలయం నందు జంతుశాస్త్ర ప్రొఫెసర్ గా నియమితులయ్యారు. విద్యార్థులకి ఆదరణీయుడై అప్పటినుండే విద్యార్థులచేత ప్రేమతో గురూజీ అని పిలువబడ్డారు. అట్ల "గురూజీ" పేరు స్థిరనామం అయింది. కాశీలో ఉన్నప్పుడే కులప్రసక్తి లేని హిందూ ఐక్యత కోసం పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ తో దగ్గరి సంబంధం ఏర్పడింది. కాశీలోనే వారికి ఆర్.ఎస్.ఎస్. స్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ తో పరిచయం ఏర్పడింది. రెండు సంవత్సరాలు ఉద్యోగం తర్వాత నాగపూర్ తిరిగివచ్చి న్యాయశాస్త్ర పట్టా సంపాదించారు. కానీ న్యాయవాద వృత్తిని చేపట్టలేదు. అదే సమయంలో వారు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులై నాగపూర్లోని రామకృష్ణ మఠానికి వెళుతుండేవారు. డాక్టర్ హెడ్గేవార్ జీ తాత్వికత ను, దేశభక్తిని, సామాజిక చింతనను దగ్గర నుండి గమనించారు. మరో వైపు తన ఆధ్యాత్మిక దృక్పథం వల్ల చివరకి బెంగాల్లోని సారగాచి ఆశ్రమానికి వెళ్లి రామకృష్ణ పరమహంస ప్రత్యక్ష శిష్యులలో ఒకరైన స్వామి అఖండానంద వద్ద శిష్యరికం చేసి దీక్ష స్వీకరించారు. అఖండానంద స్వర్గస్తులైన తర్వాత గురూజీ నాగపూర్ తిరిగివచ్చి డాక్టర్జీ నిర్వహిస్తున్న హిందూసమాజ సంఘటనకార్యంలో నిమగ్నులవ్వటం జరిగింది. ఈ క్రమంలో డా. హెడ్గేవార్ 1939లో ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ బాధ్యతను గురూజీకి అప్పగించారు. డాక్టర్ జీ స్వర్గస్తుడైన తర్వాత గురూజీ ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ బాధ్యతలను స్వీకరించారు. 33 సంవత్సరాలు సర్ సంఘచాలక్ గా ఉండి, సుదృఢ హిందూసమాజాన్ని నిర్మాణం చేయటంలో కీలక పాత్ర పోషించారు. సమరసత ఆచరణరూపం గురూజీ హిందూసమాజంలో కుల వివక్ష, అంటరానితనం అనే కొన్ని లోపాలు దూరం చేసేందుకు ప్రయత్నించిన మహాపురుషుల్లో శ్రీ గురూజీ ఒకరు. శ్రీ గురూజీ జీవితంలో అస్పృశ్యతను పట్టించుకోకుండా,సమత్వాన్ని చూపిన సంఘటనలు మనకు కన్పిస్తాయి. ఒకసారి ఆర్.ఎస్.ఎస్.శిక్షణ శిబిరంలో శ్రీ గురూజీ ఇతర కార్యకర్తలతో కలిసి భోజనానికి కూర్చున్నారు. స్వయంసేవకులు వడ్డిస్తున్నారు. వారిలో ఒకరు దూరంగా నిలబడి ఉండటం గమనించి, శ్రీ గురూజీ అతడిని విషయం ఏమిటని అడిగారు. అప్పుడు అతడు "నేను నిమ్నకులానికి చెందినవాడిని, మీ వంటి పూజ్యులకు ఎలా వడ్డించాలి?" అంటూ అనుమానం వ్యక్తపర్చాడు. శ్రీ గురూజీ అతడి చేయి పట్టుకొని తీసుకుని పోయి అక్కడ ఉన్న జిలేబిలను తన కంచంలో వడ్డించుమని అన్నారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళ కంచాలలోను వడ్డింపజేశారు.అప్పుడు ఆ స్వయంసేవక్ ఎంతో ఆనందించాడు. మరోసారి ఉత్తరప్రదేశ్ పర్యటనలో శ్రీ గురూజీ ఒక గ్రామంలో పూరిగుడిసెలో నివసించే వ్యక్తి ఇంటికి గ్రామపెద్దలతో కలిసి వెళ్లారు. అతను అతిధులుగా వచ్చిన అందరి కోసం భార్యతో టీ తయారు చేయించాడు. చాయ్ వడపోసే జాలి(జల్లెడ) కనపడకపోయే సరికి, తన భుజం మీదున్న మాసిపోయిన తువ్వాలు తో వడపోసి తేనీరు ఇచ్చాడు. త్రాగడానికి త్రక్కిన వారంతా కారణాలు చెప్పగా, శ్రీ గురూజీ మాత్రం మామూలుగానే త్రాగారు. బయటకు వచ్చాక ఎలా త్రాగగలిగారు అని మిగిలిన వారు శ్రీ గురూజీని అడిగారు. అప్పుడు శ్రీ గురూజీ "మీరు మాసిపోయిన తువ్వాలనే చూశారు, నేను మాత్రం ఆ వ్యక్తి స్వచ్చమైన హృదయాన్ని చూశాను" అన్నారు. ఇలాంటి ఆచరణాత్మక జీవనము శ్రీ గురూజీది. అస్పృశ్యత కు వ్యతిరేఖంగా ధర్మాచార్యులచే ప్రకటన అంటరానితనం హిందుత్వలోని దురాచారం. దీన్ని పోగొట్టటానికి పీఠాధిపతులే ముందు నిలవాలని భావించి శ్రీ గురూజీ దేశంలోని వివిధ సంప్రదాయాలకు చెందిన మాటధిపతుల్ని, పీఠాధిపతుల్ని 1964 లో ముంబయి స్వామి చిన్మయానంద ఆశ్రమంలో ఒకే వేదికగా కలిపారు. ఈ వేదిక నే సామాజిక సమరసతను పెంపొందింపజేసి హిందువులలో పరస్పర ప్రేమ,అనుబంధాలను వికసింపజేసే విశ్వహిందూ పరిషత్ ఆవిర్భావానికి కారణమైంది. తర్వాత 1966 ప్రయాగ కుంభమేళా ద్వారా సామరస్య హిందూ సమాజమే ధ్యేయమనే తీర్మానాన్ని ప్రకటింపజేశారు. 1969 ఉడిపి లో జరిగిన ధార్మిక సమ్మేళనం ద్వారా పీఠాధిపతులంతా " అంటరానితనం హిందూధర్మ సమ్మతం కాదు, హిందువులంతా సహోదరులే, హిందువులలో పతితులెవ్వరు లేరని" ప్రకటింపజేయటంలో శ్రీ గురూజీ కృతకృత్యులయ్యారు. తర్వాత శ్రీ పెజావర్ విశ్వేశ్వర తీర్థ స్వామీజీ, స్వామి చిన్మయానంద వంటి అనేకమంది సాధువులు హరిజన వాడ లు సందర్శించేలా, కుల వివక్ష లేకుండా దీక్ష ఇచ్చేట్లు శ్రీ గురూజీ ప్రోత్సహించారు. తర్వాతి కాలంలో పట్టణాలలోని మురికివాడల్లో, గ్రామాల్లోని సామాజిక వెనుకబాటుకి గురైన ప్రజల వాడలలో విద్య, వైద్యం, సంస్కారం అందించుటకు వివిధ సేవా కార్యక్రమాలు కూడా ప్రారంభించబడ్డాయి. కులస్పృహ ఏ మాత్రం లేకుండా హిందువులుగా జీవించే అలవాటుని నిర్మాణం చేసే ఆర్.ఎస్.ఎస్ విస్తరణలో శ్రీ గురూజీ కృషి వెలకట్టలేనిది. గురూజీ 33 సం,ల సర్ సంఘ్ చాలక్ కాలఖండంలో ఆర్.ఎస్.ఎస్.అన్ని జిల్లాలకు చేరింది. అన్ని సామాజిక రంగాలకిి హిందుత్వ ఆలోచన ప్రవేశించింది. సామాజిక సమరసతా పరిమళాలను సమాజమంతటికీ వెదజల్లటంలో శ్రీ గురూజీ జీవితం ధన్యం అయింది. నూతన దిశను హిందూసమాజానికి అందించి, శక్తివంతం జేసిన శ్రీ గురూజీ 1973 జూన్ 5 న తన తనువు చాలించారు. ఆ సమరసతా పరిమళాలను అందుకున్న లక్షలాది స్వయంసేవకులు సమరసతా కార్యాన్ని నేటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. మనమూ వారిని అనుసరిద్దాం... సమరసత ను ఆచరిద్దాం.......
Your experience on this site will be improved by allowing cookies.