సామాజిక సమరసత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర సంయోజక్ అప్పాల ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం రాత్రి కరీంనగర్ పట్టణంలోని కోదండ రామాలయంలో జరిగిన సమరసతా సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమరసత కోసం జీవించిన భాగ్యరెడ్డి వర్మ, గౌతమ బుద్ధుడు, వీర సావర్కర్, అహల్య భాయి హోల్కర్ ల జయంతుల సందర్భంగా ఈ సమ్మేళనం జరిగింది. భారతదేశం వైవిధ్యంతో కూడిన దేశమని, ఇక్కడ సామరస్యం తప్ప సంఘర్షణ జరుగదని తెలిపారు. మహాపురుషులు అనేకమంది సామాజిక సమరసతకు వారి జీవితాలు అర్పించారని కొనియాడారు. భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ భవనం ద్వారా బాలికలకు పాఠశాల ప్రారంభించారని వివరించారు. బుద్ధుని అహింస, శాంతిని అందించే బౌద్ధం ప్రపంచంలో అనేక దేశాలకు విస్తరించిందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య వీర సావర్కర్ తన సొంత జిల్లాలో హరిజనులను పూజారులుగా నియమించారని చేపరు. అహల్య భాయి హోల్కర్ దేశంలోని ప్రధాన మందిరాలను పునర్నిర్మాణం చేసినట్లు తెలిపారు. స్త్రీ నేతృత్వ శక్తికి అహల్య భాయ్ నిదర్శనం అని ఆయన అన్నారు.సమరసత వేదిక గ్రామాల్లో అన్ని కులాల మధ్య సమన్వయం సాధించటానికి పని చేస్తుందని చెప్పారు. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం అనే స్ఫూర్తి అంతటా నేడు కనిపిస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో ఇదే హిందూ భావనతో సమాజం అంతా ఐకమత్యం తో శక్తివంతంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమ్మేళనంలో వేదిక జిల్లా అధ్యక్షులు తుమ్మల రమేష్ రెడ్డి,పుల్లూరు రామారావు, మహిళా విభాగం వినోద, సంధ్య మరియు సభ్యులు పురుషోత్తం, సంతోష్, నర్సింగం తదితరులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.