స్కీం ఉద్యోగులు, అంగనవాడి వర్కర్స్, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు బూర్ల లక్ష్మినారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల రామగుండంలో జరిగిన బిఎంఎస్ 4వ త్రైవార్షిక రాష్ట్ర మహాసభల సందర్భంగా చేసిన తీర్మాణాలను అమలు పరచాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి కలెక్టరేటు ముందు మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మినారాయణ మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమం పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించడం దారుణమన్నారు. అలాంటి వారికోసం కార్మిక మండళ్ళను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతన జీవో అమలు కాకపోవడం వల్ల శ్రమదోపిడి జరుగుతోందన్న ఆయన, జీవో 5ను అమలు చేయాలని కోరారు. వీధి వ్యాపారులకు ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరం ఉందని, వీధి వ్యాపారులను గుర్తించి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆటో, ప్రైవేటు రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టరు కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ ధర్నాలో జిల్లా ప్రధాన కార్యదర్శి కంది శ్రీనివాస్ గౌడ్, సింగరేణి కార్మిక సంఘ్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ఆర్ఎఫ్సిఎల్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంక రాజేష్, ఎన్టిపీసి కార్మిక సంఘ్ ప్రధాన కార్యదర్శి ఎన్.సాగర్ రాజు, కోశాధికారి చల్ల సత్యనారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.