రామగుండం నియోజకవర్గం, అంతర్గాం మండలం: అకెనపల్లి గ్రామంలోని హనుమాన్ గుడి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సీతారాములు పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెగా ముస్తాబై భక్తులకు దర్శనమిచ్చారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య జరిగిన ఈ దివ్య కళ్యాణాన్ని చూసేందుకు అశేష భక్తజనం భారీగా తరలివచ్చారు. ఈ మహోత్సవంలో అమ్మవారి తరపున సర్పంచ్ గాదె స్రవంతి-సుధాకర్ దంపతులు, స్వామివారి తరపున నల్లపు సునీత-మహేందర్ దంపతులు కన్యాదాన, కళ్యాణ క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీతారాములకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తూ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. ఈ వేడుక గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకుంది. కళ్యాణానంతరం భక్తులకు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, వందలాది మంది ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం సాయంత్రం గ్రామ పురవీధుల్లో శ్రీ సీతారాముల శోభాయాత్ర ఘనంగా సాగింది. మంగళహారతులు, భజన కీర్తనలతో గ్రామం మొత్తం రామనామ స్మరణతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, వార్డు సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు
Your experience on this site will be improved by allowing cookies.