రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన బోదనపు నటరాజ్ కు హర్యానా రాష్ట్రానికి చెందిన ఎం.బి.ఆర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ సతీష్ కుమార్, సినీ యాక్టర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ మనోజ్ కుమార్ భాగ్య, సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ పూనం గోయల్, సెనేట్ మెంబర్ డాక్టర్ గణగళ్ల విజయ్ కుమార్ గారి చేతులమీదుగా అందజేశారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నటరాజ్ విద్యతో పాటు కళారంగంలో విశిష్ట కృషి సల్పినందుకు ఈ డాక్టరేట్ ను అందించడం జరిగింది. చిన్నతనం నుండే పాటలంటే మక్కువతో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, గురువుల దీవెనలతో, విద్యలోనూ ఎం.ఎస్.సి.జంతు శాస్త్రం,ఎం.ఏ. తెలుగు,ఎం.ఏ.సమాజ శాస్త్రం, బి.ఇడి.,ఎం.ఇడి.,ఆహారం మరియు పోషణ కోర్సులు పూర్తి చేసి ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తూ,అటు కళలోను,ఇటు కులవృత్తిలోనూ ఆరితేరాడు. నటరాజ్ కళారంగంలో జానపద గేయాలు సామాజిక చైతన్య గీతాలు,ఉద్యమ గీతాలు రాస్తూ రచయితగా,పాటలు ఆలపిస్తూ గాయకుడిగా,లఘు చిత్రాలలో నటిస్తూ నటుడిగా,కళాశాలలో ఉపన్యాసకులుగా,వృత్తి కళాకారునిగా,చిత్రకారునిగా,బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన నటరాజ్ కు ఈ అరుదైన గౌరవం లభించింది. డాక్టరేట్ అందుకున్న నటరాజ్ తన జీవితంలో మరెన్నో పురస్కారాలను అందుకోవాలని పలువురు కళాకారులు, గురువులు,ఉపన్యాసకులు, మేధావులు,గ్రామ ప్రజలు ఆకాంక్షిస్తూ,అభినందనలు తెలియజేశారు.
Comments 0